తెలంగాణా నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలి : టీపీసీసీ తీర్మానం

గురువారం, 4 జనవరి 2024 (10:01 IST)
తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం చేశారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ తీర్మానం ప్రవేశపెట్టగా, దీన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ దీపదాస్ మునీ కూడా పాల్గొన్నారు. 
 
ఇందులో రేవంత్ రెడ్డి మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మునీకి అభినందనలు తెలుపుతూ తొలి తీర్మానం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీని పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు.
 
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ బాధ్యత తమదే అన్నారు. 
 
అలాగే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామన్నారు. 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్‌సభ స్థానాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 
 
ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని... 20వ తేదీ తర్వాత క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామని తెలిపారు. సోనియమ్మ పోటీ చేస్తే ఆమెను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు