శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చివేస్తాం... బాంబు బెదిరింపు...

వరుణ్

మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (08:45 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని వైభవ్ తివారీగా గుర్తించారు. బెంగుళూరు నగరానికి చెందిన ఈ నిందితుడు... విమానంలో హైజాకర్లు ఉన్నారని, వారు బాంబులతో విమాశ్రయాన్ని పేల్చివేస్తారంటూ శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు ఈమెయిల్స్ పంపించాడు. రెండు పర్యాయాలు అతడు ఇలాగే ఈమెయిల్స్ చేరవేశాడు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దాంతో ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేలింది. దీంతో కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి.. బెంగుళూరుకు చెందిన వైభవ్ తివారీయే ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడినట్టు గుర్తించి అరెస్టు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన తివారీ ఈ తరహా నకిలీ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. 
 
భారీ టిప్ ఇచ్చిన కష్టమర్... వెయిట్రస్‌కు షాకిచ్చిన రెస్టారెంట్ యజమాని...
 
రెస్టారెంట్‌కు వచ్చిన ఓ కస్టమర్.. తనకు సర్వ్ చేసిన వెయిట్రస్‌కు భారీ గిఫ్టు ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన రెస్టారెంట్ యజమాని మాత్రం ఆ లేడీ వెయిటర్‌కు తేరుకోలేని షాకిచ్చాడు. కస్టమర్ నుంచి భారీ గిఫ్ట్ అందుకున్న వెయిటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాడు. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంటన్ హార్బర్‌లోని 'మాసన్ జార్ కేఫ్'కు ఓ కస్టమర్ వచ్చాడు. తనకు కావాల్సిన ఆహార పదార్థాలను తెప్పించుకుని ఆరగించాడు. ఇందుకోసం 32.43 డాలర్ల బిల్ చేశాడు. ఆ బిల్ తెచ్చిన వెయిట్రస్‌కు ఏకంగా 10 వేల డాలర్ల టిప్ ఇచ్చాడు. మన రూపాయల్లో చెప్పాలంటే.. సుమారు 2,700 బిల్లు అయితే సుమారుగా 8.30 లక్షల రూపాయలు టిప్‌గా ఇచ్చాడు. బిల్ పేపర్‌పై అమౌంట్ రాసి కార్డు చేతికిచ్చాడు. టిప్ అమౌంట్ భారీగా ఉండడంతో ఏమరపాటులో రాశారేమోనని రెస్టారెంట్ మేనేజర్ స్వయంగా వెళ్లి కస్టమర్‌తో మాట్లాడాడు. అయితే, తాను కరెక్టుగానే వేశానని, రెస్టారెంట్‌లోని వెయిటర్లంతా సమానంగా పంచుకోవాలని సూచించాడు.
 
దీంతో రెస్టారెంట్ సిబ్బంది సంతోషంతో గంతులు వేశారు. ఆ టిప్ అందుకున్న వెయిట్రస్ సంతోషం అంతా ఇంతా కాదు. అయితే, ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. వారం రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పి రెస్టారెంట్ యాజమాన్యం ఆమెకు షాకిచ్చింది. ఇదేంటని అడిగినా సరైన కారణం చెప్పలేదని వెయిట్రస్ వాపోయింది. పదిహేనేళ్ల వయసు నుంచి తాను వివిధ ఉద్యోగాలు చేశానని, ఇన్నేళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి (ఉద్యోగం లేకుండా) ఎదుర్కోలేదని చెప్పింది.
 
ఈ విషయంపై సదరు రెస్టారెంట్ యాజమాన్యాన్ని మీడియా సంప్రదించగా.. వెయిట్రస్‌‌ను తొలగించడానికి, ఆమె అందుకున్న భారీ టిప్‌కు సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఆమెను తొలగించడం పూర్తిగా బిజినెస్ పరమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. అయితే, ఆ కారణం ఏంటనేది చెప్పడానికి యాజమాన్యం నిరాకరించింది. ఉద్యోగులను తాము చాలా బాగా చూసుకుంటామని, తమ సిబ్బందిలో చాలామంది ఐదారేళ్లుగా పనిచేస్తున్నవారేనని వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు