హైదరాబాద్ రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ దందా.. ఎనిమిదో నిందితుడుగా డైరెక్టర్ క్రిష్

వరుణ్

మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (15:21 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ దందా వెలుగు చూసింది. ఈ కేసులో ఓ నిందితుడిగా సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఆయన ఎనిమిదో నిందితుడిగా పేరును నమోదు చేశారు. ఈ హోటల్‌లో కొకైన్ డ్రగ్ పార్టీ జరుగతున్నట్టుగా పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు సోమవారం ఈ హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న ఓ ముఠాను అరెస్టు చేశారు. 
 
ఈ పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ అదే హోటల్‌లో పార్టీ నిర్వాహకుడు వివేకానందతో మాట్లాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన గదిలో దాదాపు అరగంట పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ కేసులో క్రిష్ పేరును ఎనిమిదో నిందితుడుగా చేరంచడంతో టాలీవుడ్‌లో మరోమారు డ్రగ్ కలకలం చెలరేగింది. అలాగే, ఈ డ్రగ్ పార్టీలో మరికొందరి పాత్ర ఉందా లేదా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
కాగా, దీనిపై క్రిష్ స్పందిస్తూ, రాడిసన్ హోటల్‌కు వెళ్లిన మాట నిజమేనని అంగీకరించారు. తాను తన స్నేహితులను కలిసేందుకు వెళ్లానని తెలిపారు. సాయంత్రం అక్కడ తాను అరగంట పాటు మాత్రమే ఉన్నానని, ఆ తర్వాత తన డ్రైవర్ రాగానే అక్కడ నుంచి వచ్చేసినట్టు తెలిపారు. పోలీసులు తనను ప్రశ్నించారని, అక్కడకు తాను ఎందుకు వెళ్లాననే విషయంపై వారు స్టేట్మెంట్ తీసుకున్నారని క్రిష్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు