కుమారి ఆంటి మెస్ హోటల్‌ యాజమాన్యానికి అండగా నిలిచిన సీఎం రేవంత్!!

వరుణ్

బుధవారం, 31 జనవరి 2024 (15:31 IST)
హైదరాబాద్ నగరంలో కుమారి ఆంటీ హోటల్ కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరింది. దీంతో ఆయన జోక్యం చేసుకుని కుమారి ఆంటీ హోటల్‌పై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అనుమతించడంతో బుధవారం మళ్లీ కుమారి ఆటీ హోటల్ తెరుచుకుంది. కుమారి ఆంటీ హోటల్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న విషయం తెల్సిందే.
 
ఈ హోటల్‌‍ మళ్లీ తెరుచుకుందన్న విషయం తెలియడంతో స్థానిక ప్రజలు మళ్లీ పోటెత్తారు. సాధారణంగా వచ్చే జనం కంటే బుధవారం రెట్టింపు సంఖ్యలో ప్రజలు వచ్చారు కుమారి ఆంటి హోటల్ ఏరియా రద్దీగా మారిపోయింది. దాంతో ఆ హోటల్ వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కుమారి ఆంటీ హోటల్‌ను సందర్శించనున్నట్టు సమాచారం. 
 
కాగా, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తొలగింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం చిరు వ్యాపారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ ధరకే ఎంతోమంది ఆకలిని తీర్చుతున్న ఫుడ్‌స్టాల్‌ను తొలగించవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు ఎక్కడైతే ఆమె వ్యాపారం చేసుకుందో ఇకపైనా అదేస్థలంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కొనసాగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. అయితే, అక్కడ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నంకాకుండా, ట్రాఫిక్‌నును క్రమబద్దీకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు