ప్లీజ్.. క్లిష్టంగా వున్న కరోనా రోగులను గాంధీ ఆసుపత్రికి పంపొద్దు: మంత్రి ఈటెల రాజేందర్

గురువారం, 22 ఏప్రియల్ 2021 (19:09 IST)
తెలంగాణలోని గాంధీ ఆసుపత్రి పూర్తిగా ఐసియుగా మారిపోయిందనీ, చరిత్రలో ఇంతపెద్దమొత్తంలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఏనాడూ రోగుల సంఖ్య లేదన్నారు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. రోగుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినప్పుడు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులను వారిని డిశ్చార్జ్ చేసి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇస్తున్నారనీ, ఫలితంగా కరోనా రోగి గాంధీ ఆసుపత్రికి చేరే లోపే వారి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.
 
ముఖ్యంగా కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యంతో ఉన్న కోవిడ్ -19 రోగులకు ఆయా ఆసుపత్రులే చికిత్స చేయాలని, వారిని గాంధీ ఆసుపత్రికి పంపవద్దని ప్రైవేటు ఆసుపత్రులను కోరారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి, గాంధీ ఆసుపత్రిలోని మొత్తం 616 వెంటిలేటర్ పడకలు పూర్తిగా ఆక్యుపై కాబడ్డాయని తెలిపారు. గాంధీలో 1,100 పడకలు ఉన్నాయనీ, అవన్నీ ఐసియు లేదా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ పడకలుగా వున్నాయన్నారు.
 
వెంటిలేటర్‌పై ఐసియులో 600 మందికి పైగా రోగులు ఉన్నారనీ, చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో వెంటిలేటర్‌లో రోగుల చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆసుపత్రి మొత్తం ఐసియుగా మారిపోయిందన్నారు. మరోవైపు మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్‌ సిలిండర్లను సొంతంగా ఏర్పాటు చేసుకుని వస్తే చికిత్స చేస్తామని అంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
 
అలాగో కరోనా రోగి ఆరోగ్యం ప్రమాదకరమైన స్థాయికి దిగజారిపోయే వరకు వేచి ఉండవద్దని ప్రజలను కోరారు. ఇంతకుమునుపు కరోనా రోగికి చికిత్స కోసం 10-12 రోజులు ఆసుపత్రిలో చికిత్స జరిగేదనీ, ఇప్పుడు క్లిష్ట సమయంలో వస్తుండటంతో వారికి చికిత్స చేసే సమయం కేవలం నాలుగైదు రోజులు మాత్రమే వుంటోందని చెప్పారు. అంతటి క్లిష్ట పరిస్థితి వచ్చే వరకూ రోగులను చికిత్సకు తీసుకుని రాకుండా వుంచొద్దని కోరారు.
 
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కోవిడ్ -19 రోగులలో 70% మంది పొరుగు రాష్ట్రాలకు చెందినవారని అన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కోవిడ్-19 పాజిటివ్ రోగులు ఇక్కడికి చికిత్స కోసం వస్తున్నారని అన్నారు. వారికి కూడా వసతి కల్పించడానికి సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే తాము 4 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు కావాలని ఆదేశించాము. అలాగే ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల సరిగా స్పందించడంలేదన్నారు. భాజపా పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో ఆక్సిజన్ విషయంలో ఎలాంటి కొరత ఏర్పడినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు