పిజ్జా తినకపోతే చచ్చిపోతామా? ఇంట్లోనే ఎల్లిపాయ మిరం తినొచ్చుగా (Video)

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (08:48 IST)
ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ - జొమాటోలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సంస్థల వల్ల కరోనా వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పైగా, ఢిల్లీలో పిజ్జా తెచ్చిన ఓ డెలివరీ బాయ్ నుంచి ఏకంగా 69 మందికి ఈ కరోనా వైరస్ సోకిందని ఆయన గుర్తు చేశారు. అందుకే సోమవారం నుంచి స్విగ్గీ, జొమాటోల ఫుడ్ డెలివరీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
 
కరోనా వైరస్ వ్యాప్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. నమోదయ్యే కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. ఇందులో తాజా అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
ముఖ్యంగా హోం ఫుడ్ డెలివరీని బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. "స్విగ్గీ, జొమాటోవాళ్లు ఆహారం సరఫరా చేస్తారు. ఇది కొంత ప్రమాదం. ఢిల్లీలో పిజ్జా తెచ్చి ఇచ్చిన వ్యక్తి వల్ల 69 మందికి కరోనా సోకింది. ఇంట్లోనే ఎల్లిపాయ మిరం తినక ఈ పిజ్జా, బొజ్జా ఎందుకు మనకు? ఈ 10-15 రోజులు పిజ్జా తినకపోతే చచ్చిపోతమా? ఫుడ్‌ డెలివరీ మంచిది కాదు. అందుకే, సోమవారం నుంచి స్విగ్గీ, జొమాటోను బంద్‌ చేస్తున్నాం. వారి కార్యకలాపాలను అనుమతించం. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం" అని కేసీఆర్ హెచ్చరిక ధోరణితో వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనుమానితులకు సంబంధించి సేకరించిన మొత్తం రక్తనమూనాల్లో హైదరాబాద్‌లో ప్రతి 10 మందిలో ఒకరికి పాజిటివ్‌ వస్తుండగా.. జిల్లాల్లో మాత్రం ప్రతి 18 మందిలో ఒకరికి వస్తోంది. ఇప్పటివరకు 14,962 మంది నమూనాలను పరీక్షించగా.. 768 మంది ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
 
అయితే, జాతీయ గణాంకాలతో పోల్చితే మన రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు తెలిపారు. పైగా, వరంగల్‌ రూరల్‌, యాదాద్రి భువనగిరి, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇకపోతే, మే 7వ వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు