కట్టుకున్న భర్తను ఏం చేసిందో చూడండి

బుధవారం, 9 అక్టోబరు 2019 (06:30 IST)
గుప్తనిధుల వేటలో స్నేహితులతో తిరుగుతూ.. అప్పులపాలైన భర్త నిత్యం తాగివచ్చి వేధిస్తున్నాడని సోదరుడితో కలిసి హతమార్చింది ఓ భార్య. అనంతరం అతను గుండెనొప్పితో మరణించాడని నమ్మించేందుకు యత్నించింది.

మృతుడి కుటుంబసభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల అసలు విషయం బయటపడింది. మద్యానికి బానిసై.. నిత్యం వేధిస్తున్నాడని ఓ ఇల్లాలు సోదరుడితో కలిసి కట్టుకున్న భర్తను హతమార్చిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం పందిరిగుండు తండాకు చెందిన పలావత్‌ ప్రసాద్‌బాబుకి అదే ప్రాంతానికి చెందిన సరోజతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చి ఆటో నడుపుతూ కుటుంబంతో వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో నివస్తున్నాడు.

వేధిస్తున్నాడని... గుప్త నిధుల తవ్వకాల కోసం ప్రసాద్ బాబు తెలిసినవారి వద్ద నుంచి దాదాపు రూ.40లక్షల వరకు అప్పుచేశాడు. రుణాల బెడద పెరగటం వల్ల నిత్యం తాగివచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 6న ఆదివారం రాత్రి సోదరుడి సాయంతో ప్రసాద్ బాబును హత్య చేసింది.

గుండెపోటు రావటం వల్ల తన భర్త మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులను నమ్మబలికింది. ఈ క్రమంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతుని దేహంపై గాయాలు, గొంతు నులిమినట్లుగా గాయాలు ఉండటం వల్ల కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. నిందితులపై హత్యకేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఉస్మానియాకు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు