"ఆర్ఆర్ఆర్" దెబ్బకు బాలీవుడ్ గగ్గోలు... రిలీజ్ తేదీపై ఆగ్రహం

బుధవారం, 27 జనవరి 2021 (19:01 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఎపుడో విడుదల కావాల్సివుంది. కానీ, పలు రకాలైన కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చింది. తాజాగా కరోనా దెబ్బకు మరింత ఆలస్యమైంది. ఈ క్రమంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇటీవలే రిలీజ్ డేట్‌ను నిర్ణయించుకుంది. 
 
వచ్చే అక్టోబరు నెల 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడీ చిత్రం విడుదల తేదీ పెద్ద బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెను దుమారాన్నే రేపింది. ఇప్పటికే తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించుకున్న కొన్ని బాలీవుడ్ చిత్రాల నిర్మాతలు దీనిపై కస్సుమంటున్నారు.
 
నిజానికి ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమా. కానీ, గతంలో రాజమౌళి నిర్మించి బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 'బాహుబలి' చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. 
 
అందుకే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' వస్తోందంటే భారతీయ చిత్ర పరిశ్రమ తన దృష్టిని ఈ చిత్రంపైనే పెట్టింది. ఆ చిత్రం విడుదల సమయంలో తమ చిత్రాలను విడుదల చేస్తే దారుణంగా నష్టపోవడం ఖాయమనే భయం బాలీవుడ్ నిర్మాతలకు పట్టుకుంది.
 
ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబరు 13న రిలీజ్ చేయాలని ప్రకటించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా తాను నిర్మిస్తున్న 'మైదాన్' చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టు ఆరు నెల క్రితమే ప్రకటించానని, ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఇలా తమ సినిమా విడుదల సమయంలోనే రిలీజ్ కానుండడం చాలా అన్యాయమని బోనీ వాపోయారు.
 
కరోనాతో ఇప్పటికే దెబ్బతిన్న చిత్ర పరిశ్రమను అందరం కలసికట్టుగా కాపాడాల్సిన ప్రస్తుత సమయంలో 'ఆర్ఆర్ఆర్' నిర్మాతలు ఇలా రిలీజ్ డేట్ ప్రకటించడం ఏమీ బాగాలేదు, ఇది అన్యాయం' అన్నారాయన. మరి దీనిపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు