చిక్కుల్లో రమ్యకృష్ణ క్వీన్... వార్నింగ్ ఇచ్చిన 'అమ్మ' మేనల్లుడు

శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (13:41 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం క్వీన్. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తుంటే, ప్రధాన పాత్రలో టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో క్వీన్ చిత్రానికి చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆపకపోతే కోర్టులో కేసు వేస్తానంటూ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, 'జ‌య‌ల‌లిత గురించి ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌మీనన్‌కి ఏం తెలుస‌ని బ‌యోపిక్ రూపొందిస్తున్నాడు. త‌క్ష‌ణమే ఈ చిత్ర షూటింగ్‌ని ఆపాల్సిందిగా హెచ్చ‌రిస్తున్నాను' అంటూ ఓ ప్రకటన చేశారు. మ‌రి దీనిపై గౌత‌మ్ మీన‌న్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి. 
 
కాగా, ఇప్పటికే జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని దర్శకుడు విజయ్‌ తలైవీ పేరుతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ అమ్మగా నటించనుంది. అదేవిధంగా దర్శకురాలు ప్రియదర్శిని 'ది ఐరన్‌ లేడీ' పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు