నటించడమే రాదని విమర్శించారు.. ఇపుడు కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా : జాన్వీ

మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:45 IST)
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ జాన్వీ కపూర్. ఈమె ధడక్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు. సినీ కెరీర్‌లో అరంగేట్రం చేసిన తొలినాళ్ల నుంచే నటనాపరంగా తనపై ఎన్నో విమర్శలను జాన్వీ ఎదుర్కొన్నారు. అయినా ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇదే అంశంపై ఆమె తాజాగా స్పందించారు. తనలో పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పారు. అందుకే ఎన్నో రకాలుగా ట్రోల్స్ చేసినప్పటికీ.. వాటన్నింటినీ పాజిటివ్‌గా స్వీకరించినట్టు చెప్పారు. 
 
కాగా, ఆమె తాజాగా నటించిన చిత్రం "గుంజన్ సక్సేనా". ఈ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికలో విడుదలై విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ 'రెండేళ్ల క్రితం నా తొలి చిత్రం 'ధడక్' విడుదలైంది. ఆ సినిమాలో నా నటన బాగోలేదని, కథానాయికగా  పనికిరానని విమర్శలు చేశారు. మా అమ్మ బ్రతికి ఉంటే నా నటన చూసి బాధపడేదని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా నేను మానసికంగా కృంగిపోలేదు. నా లోపాల్ని సరిదిద్దుకొని నన్ను నేను తెరపై కొత్తగా చూడాలనుకున్నా.
 
ఇపుడు 'గుంజన్‌ సక్సేనా' చిత్ర సమీక్షల్లో నా నటన అద్భుతంగా ఉందని చాలా మంది మెచ్చుకున్నారు. అవి చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు ఎంత ముఖ్యమైనవో తొలిసారిగా తెలిసొచ్చింది. అమ్మ బ్రతికి ఉంటే ఈ సినిమా చూసి ఎంతో సంతోషపడేది. నా విజయం గురించి అందరికి చెప్పేది. విమర్శల్ని పాజిటివ్‌గా తీసుకున్నాను కాబట్టే ఈ రోజు విజయం సాధించగలిగాను' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. భారతీయ తొలి మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, దీనికి మంచి ఆదరణ లభిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు