రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో.. ఆ పాడు పనికి పాల్పడింది గుంటూరు జిల్లా వాసే..

వరుణ్

ఆదివారం, 21 జనవరి 2024 (11:53 IST)
హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తిని అరెస్టు చేసింది ఏపీలో అన్న విషయం తాజాగా వెల్లడైంది. నిందితుడిని ఈమని నవీన్ అని గుర్తించారు. 24 ఏళ్ల నవీన్ గుంటూరు జిల్లాకు చెందినవాడు. అసభ్యకర రీతిలో రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించి, ఆ వీడియో సోషల్ మీడియా వేదికల్లో అప్ లోడ్ చేసింది నవీనే అని వెల్లడైంది.
 
ఈ కేసు విచారణలో భాగంగా డీప్ ఫేక్ వీడియోలతో సంబంధం ఉందని భావించిన 500కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించామని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేకమంది సోషల్ మీడియా ఖాతాల సొంతదారులను విచారించామని, ఫేక్ వీడియోకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించామని తెలిపారు.
 
అనుమానితులను లోతుగా విచారించిన తర్వాత రష్మిక డీప్ ఫేక్ వీడియో ఓ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అప్‌లోడ్ అయినట్టు గుర్తించామని డీసీపీ వివరించారు. ఒరిజినల్ వీడియో వాస్తవానికి ఓ జరా పటేల్ అనే బ్రిటీష్ మోడల్ దని, ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 2023 అక్టోబరు 9వ తేదీన పోస్టు చేశారని, ఆ వీడియో ఆధారంగా రష్మిక డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన అక్టోబరు 13న పోస్టు చేశారని వెల్లడించారు.
 
సేకరించిన ఆధారాల ప్రకారం ఏపీలోని గుంటూరు చేరుకుని, నిందితుడు నవీన్ ఆచూకీ కనుగొన్నామని తెలిపారు. అతడు తన నేరాన్ని అంగీకరించాడని డీసీపీ పేర్కొన్నారు. విచారణలో నవీన్, తాను రష్మికకు పెద్ద అభిమానినని చెప్పాడని, ఆమె పేరిట ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నట్టు తెలిపాడని వివరించారు. మరో ఇద్దరు సెలబ్రిటీల పేరిట కూడా నవీన్ ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నాడని డీసీపీ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు