పెంబర్తిలో మళ్లీ బంగారం బయటపడింది, మాకూ వాటా వుందంటూ పూర్వ యజమానులు

శనివారం, 10 ఏప్రియల్ 2021 (10:04 IST)
పెంబర్తిలో లంకెబిందె లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పురావస్తు శాఖ మళ్లీ అక్కడ తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో మరో 6.3 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 గ్రాముల వెండి గొలుసులు, 7.2 గ్రాముల పగడాలు లభ్యమయ్యాయి.
 
కాగా ఇప్పటివరకూ దొరికిన బంగారు ఆభరణాల్లో తమకూ వాటా ఇవ్వాలంటూ ఈ భూమిని విక్రయించిన మొదటి పట్టాదారులు ఆందోళనకు దిగారు. దీనితో రెవిన్యూ అధికారులు కలుగజేసుకుని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ ఆభరణాలన్నీ ఓ కుటుంబానికి సంబంధించినవని స్థానికులు చర్చించుకుంటున్నారు.
 
జనగామ జిల్లా పెంబర్తిలో గురువారం నాడు ఓ లంకెబిందె వెలుగుచూసింది. హైదరాబాదు నగరానికి చెందిన నర్సింహ అనే వ్యక్తి పెంబర్తి పరిధిలో వున్న 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో వెంచర్ వేసేందుకు భూమిని జెసిబితో చదును చేయిస్తున్నాడు. ఆ సమయంలో జెసిబికి లంకెబిందె తగిలింది.
 
 ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయగా వారు వచ్చి బిందెను తెరిచి చూడగా అందులో 5 కిలోల బంగారం, 2 కిలోల వెండి వున్నట్లు కనుగొన్నారు. కాగా తనకు గత కొన్నిరోజులుగా అమ్మవారు కలలోకి వస్తోందనీ, తన భూమిలో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తానని యజమాని చెప్పాడు. కాగా లంకెబిందె బయటపడటంతో పురావస్తు శాఖ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు