యడ్డీకి బళ్లారి విభజన చిచ్చు... ఎమ్మెల్యేల హెచ్చరిక!

ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (08:54 IST)
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు బళ్లారి విభజన చిచ్చు మొదలైంది. బళ్లారిని విభజిస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ సొంతపార్టీకి చెందిన పలువురు హెచ్చరించారు. ఫలితంగా బళ్లారి విభజన చిచ్చు ముఖ్యమంత్రి యడ్యూరప్ప మెడకు చుట్టుకుని, చివరకు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా కనిపిస్తున్నాయి. 
 
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బళ్ళారి జిల్లాను రెండుగా విభజించాలనే సీఎం యడియూరప్ప ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ జిల్లాను విభజించి విజయనగర్‌ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని ఇటీవల తనను కలిసిన పార్టీ నేతలు, ప్రతినిధులకు సీఎం యడ్యూరప్ప హామీ ఇచ్చారు. 
 
ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ ఒత్తడి ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని బళ్ళారి జిల్లాకు చెందిన కీలక ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి హెచ్చరించారు.
 
సీఎం యడియూరప్ప విజయనగర్‌ను జిల్లా చేస్తామని ప్రస్తావించినప్పటి నుంచే బీజేపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రె‌స్‌లో సుదీర్ఘకాలం కొనసాగి పదవులు అనుభవించి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన ఆనంద్‌ సింగ్‌ కోసమే జిల్లాను విడగొడతానంటే ఎలా సాధ్యమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 
 
కొన్నేళ్ళకాలంగా కొప్పళ్‌, బెళ్గావి జిల్లాలను విభజించాలనే డిమాండ్‌లపై సీఎం ఎందుకు స్పందించడం లేదనేది ప్రస్తుతం కీలకం అవుతోంది. జిల్లా విభజన తేనెతుట్టెవంటిదని కదిపితే కష్టమేనని పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయాల సుడిగుండంలో పాలన సాగిస్తున్న యడ్యూరప్ప అనవసరంగా జిల్లా విభజన ప్రస్తావన తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు