డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయి... శ్వేతసౌధాన్ని ఖాళీ చేయనని భీష్మించుకుని కూర్చొంటే...

గురువారం, 5 నవంబరు 2020 (14:04 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు లాంఛనమే. అదేసమయంలో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓటమి ఖాయంగా తెలుస్తోంది. ఆ ప్రకారంగా ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి, శ్వేతసౌథాన్ని ఖాళీ చేయనని భీష్మించుకుని కూర్చుంటే ఏం చేయాలి..? తదుపరి అధ్యక్షుడికి అధికారం అప్పగించకుంటే. అమెరికాలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? ఈ సమయంలో ఎవరి పాత్ర కీలకంగా మారనుంది? అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. దీనికికారణం డోనాల్డ్ ట్రంప్ వైఖరే. 
 
అమెరికా పత్రికల సమాచారం ప్రకారం... ట్రంప్ ఓడిపోయినా.. శ్వేత సౌధాన్ని ఖాళీ చేయని పక్షంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడి పాత్ర, సీక్రెట్ ఏజెన్సీల పాత్రే కీలకంగా మారుతుంది.. ట్రంప్ ఎంతకూ వినకపోతే సీక్రెట్ ఏజెన్సీల సహాయంతో వైట్‌హౌస్ నుంచి ఆయన్ను ఖాళీ చేయిస్తారని అమెరికాకు చెందిన ఓ పత్రిక పేర్కొంది. 
 
ఈ విషయంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సీక్రెట్ ఏజెన్సీలకు పూర్తి స్వేచ్ఛనిస్తారని ఆ పత్రిక పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే సీక్రెట్ ఏజెన్సీలు పూర్తి స్వేచ్ఛతో వ్యవహరిస్తారని, ఆ సమయంలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు అవుతారు కాబట్టి... ప్రొటోకాల్ నిబంధనలు కూడా అడ్డొచ్చే అవకాశమే ఉండదని సమాచారం.
 
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకోడానికి నిరాకరిస్తే... అతణ్ని చట్టబద్ధంగా తొలగించడానికి అమెరికా రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు కూడా లేవని నిపుణులు పేర్కొంటున్నారు. అధికారాన్ని తదుపరి అధ్యక్షుడికి అప్పగించడానికి నిరాకరిస్తే... ఆ అధ్యక్షుణ్ని ఎలా తొలగించాలన్న అంశం అమెరికా రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆ అమెరికా పత్రిక పేర్కొంది. డోనాల్డ్ ట్రంప్ గనుక అధికారాన్ని అప్పగించే విషయంలో భీష్మించుకొని కూర్చుంటే అగ్రరాజ్యంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు