వినాయక చవితి రోజున వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు... ఎలా చేయాలి?

శనివారం, 31 ఆగస్టు 2019 (15:00 IST)
బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లంటే మహా ప్రీతి. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఇక ఏ ఆటంకమూ రాదని పురోహితులు చెబుతున్నారు. ఇంకేముంది..? మీరు కూడా ఉండ్రాళ్ళు తయారుచేసి బొజ్జ గణపయ్య లొట్టలేసుకుని తినేలా చేయండి.
 
ఉండ్రాళ్లకు కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి: ఒక కప్పు
పాలు: ఒక కప్పు
నువ్వులు: అరకప్పు
పంచదార: ఒక కప్పు
కొబ్బరి తురుము: ఒక కప్పు 
యాలకల పొడి: అర టేబుల్ స్పూన్
నీరు: రెండు కప్పులు
ఉప్పు: చిటికెడు 
 
తయారీ విధానం:
ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్‌ను స్టౌ మీద పెట్టి అందులో రెండు కప్పుల నీటిని పోసి వేడి చేసుకోవాలి. నీరు వేడైన తర్వాత మెత్తగా కొట్టి పెట్టుకున్న బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. బియ్యం పిండిని ఉడికించుకునేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా మూతపెట్టాలి. ఐదు నిమిషాలు ఉడికిన బియ్యం పిండిని స్టౌ మీద నుంచి కిందికి దించుకుని చిన్ని చిన్ని ఉండలుగా చేసుకోవాలి. 
 
ఈలోపు మరో ప్యాన్‌ను స్టౌ మీద పెట్టి పంచదారలో తగినన్ని నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి. ఇందులో కొబ్బరి తురుము కూడా వేసి కొద్దిసేపు వేడిచేయాలి. తర్వాత బియ్యం పిండితో చేసిన చిన్ని ఉండలను పాకంలో వేసుకోవాలి. ఇందులో పాలు కూడా పోసి బియ్యం ఉండలకు పంచదార పాకం, పాలు పట్టేలా కొద్దిసేపు ఉడకనివ్వాలి.
 
అలాగే నువ్వులను కొద్దిగా వేడిచేసి పొడిచేసుకోవాలి. ఈ పొడిని పాల ఉండల్లో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. చిక్కగా సిరప్‌లా తయారవుతుంది. చివరిగా యాలకుల పొడిని చల్లుకుని దించుకోవాలి. అంతే వినాయకునికి భలే నచ్చే ఉండ్రాళ్లు రెడీ..!
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు