వైకాపాకు ప్రచారం చేసిన 46 మంది వలంటీర్లపై వేటు : సీఈవో మీనా వెల్లడి

ఠాగూర్

గురువారం, 21 మార్చి 2024 (11:01 IST)
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి అధికార వైకాపాకు ప్రచారం చేసిన 46 మంది వలంటీర్లపై చర్యలు తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రెగ్యులర్‌, ఒప్పంద ఉద్యోగులు, గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం నిబంధనలకు విరుద్ధమన్నారు. 
 
గత 3 రోజుల వ్యవధిలో అలాంటి 46 మందిపైన శాఖాపరమైన, క్రిమినల్‌ చర్యలు తీసుకున్నామన్నారు. వారిలో 40 మంది వాలంటీర్లే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. మిగతావారు వీఆర్వోలు, ఇతర ఒప్పంద ఉద్యోగులు అని చెప్పారు. రాజకీయ సమావేశాలు, కార్యకలాపాల్లో పాల్గొన్న రెగ్యులర్‌ ఉద్యోగుల్ని సస్పెండ్‌ చేశామని గుర్తు చేశారు. ఒప్పంద ఉద్యోగులు, వాలంటీర్లను తొలగించామని, స్వయంగా రాజకీయ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపైన క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 
 
మరికొంతమందిపైనా ఫిర్యాదులు అందాయని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోనూ వినియోగించొద్దని, వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. పోలింగ్‌ ఏజెంట్లుగా అనుమతించొద్దని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా తాజాగా తొలగించిన, కేసులు నమోదైన వాలంటీర్లు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండొచ్చా లేదా అనే దానిపై సరైన సమయంలో నిర్ణయం చెబుతామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు