దిగివచ్చిన ఏపీ సర్కారు... వేతనాల పెంపునకు ఒకే... అంగన్వాడీల సమ్మె విరమణ

వరుణ్

మంగళవారం, 23 జనవరి 2024 (11:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెను విరమించారు. వీరి సమస్యలను పరిష్కరించే విషయంలో మొండిగా వ్యవహరించిన ఏపీ సర్కారు.. ఎట్టకేలకు దిగివచ్చింది. అంగన్‌‍‌వాడీ వర్కర్ల వేతనాలు పెంపుతో పాటు.. ఇతర సమ్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చింది. దీంతో అంగన్‌‌వాడీ కార్యకర్తలు వెనక్కి తగ్గారు. ఈ మేరకు సోమవారం అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
 
ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. జులై నెలలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి అంగన్వాడీలు యధావిధిగా విధులను కొనసాగించనున్నారు.
 
అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన చర్చలు చేపట్టారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్టు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో సమ్మె విరమణకు అంగీకరించారని తెలిపారు. రెండు దఫాలు చర్చలు జరిగాయని, అంగన్వాడీలపై నమోదైన కేసులను సీఎం జగన్‌తో చర్చించి ఎత్తివేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 
 
అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.60 వేలకు పెంచామని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. సమ్మె కాలంపై ఏం చేయాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని బొత్స తెలిపారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లుగా నిర్ణయించామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మార్చనున్నామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు