బైకును ఢీకొట్టిన కారు... ఎగిరి బానెట్‌పై పడి చనిపోయిన బైకర్... 18 కిమీ వెళ్లిన కారు...

వరుణ్

మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (11:42 IST)
ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాద వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అమిత వేగంతో వచ్చిన ఓ కారు.. బైకును ఢీకొట్టింది. దీంతో బైకర్ ఎగిరి బానట్‌పై పడి చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కారు డ్రైవర్.. ఏమాత్రం పట్టించుకోకుండా బానట్‌పైపడివున్న మృతదేహంతో ఏకంగా 18 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయాడు. కారుపై మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా నిలబడి కారును ఆపారు. దీంతో భయపడిపోయిన డ్రైలర్ కారును ఆపేసి పారిపోయాడు. మద్యం మత్తులో డ్రైవర్ ఉండటంతో బానట్‌‍పై మృతదేహం ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. 
 
ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం చోళ సముద్రానికి చెందిన జిన్నే ఎర్రి స్వామి(35) ట్రాక్టర్ మెకానిక్.. భార్య మంజుల, ఇద్దరు పిల్లలతో కలిసి ఎర్రి స్వామి అనంతపురంలో స్థిరపడ్డాడు. ఆదివారం సిద్ధరాంపురం వెళ్లిన ఎర్రి స్వామి రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్‌పై తిరుగుప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో వై కొత్తపల్లి సమీపంలో కళ్యాణదుర్గం వైపు వెళుతున్న ఓ కారు స్వామి బైక్‌‌ను ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో స్వామి ఎగిరి కారు బానెట్ పై పడి చనిపోయాడు.
 
మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ఈ ప్రమాదాన్ని గుర్తించనేలేదు. బానెట్‌పై మృతదేహంతోనే కారును 18 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. కారుపై మనిషి పడి ఉండడం గమనించిన హనిమిరెడ్డిపల్లి గ్రామస్థులు కారును ఆపారు. దీంతో కిందికి దిగిన డ్రైవర్.. బానెట్‌‍పై స్వామి మృతదేహాన్ని గమనించాడు. కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు