మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వద్దు: కృష్ణా జిల్లా కలెక్టర్

సోమవారం, 27 జులై 2020 (09:27 IST)
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్క్ ధరించడంలో, ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడంపై అవగాహన కలిగి ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ సూచించారు.

మాస్క్ ధరించడంలో అనుసరించవలసిన అంశాలను, ఆక్సిజన్ స్థాయి(శ్వాస పరిస్థితి)ని పల్స్ ఆక్సిమీటర్ ద్వారా కొలిచే విధానాలపై ప్రజలు అవగాహన కలిగించేందుకు అందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ముఖ్యంగా ఊపితిత్తుల పై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పల్స్ ఆక్సిమీటర్ ద్వారా తెలుసుకొనుట ద్వారా కోవిడ్ వ్యాప్తి స్థాయి, ఊపిరితిత్తులు వేరే వ్యాధి ఉందా అని తెలుసుకోవచ్చన్నారు.

శరీరంలో ఎస్ పిఓ-2 లెవెల్ ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవడం పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఎంతో సులభం అన్నారు. వీటిని ప్రతి ఇంటిలో ఉంచుకోవడం మంచిదన్నారు. పల్స్ ఆక్సిమీటర్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయి, పల్స్ రేటును తెలుసుకోవచ్చన్నారు.

94 నుండి 100 శాతం ఉండి పల్స్ రేటు 60 నుండి 100 శాతం వరకూ ఉంటే సాధారణ పరిస్థితి ఉన్నట్లని తెలియజేశారు. 80 శాతం కన్నా తక్కువ ఉంటే ప్రమాదకర పరిస్థితి ఉంటుందని, 88 నుండి 94 శాతం లోపు ఉంటే కరోనా పరీక్షలు నిర్వహించుకోవలసిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా 6 నిముషాలపాటు వాక్ టెస్ట్ ద్వారా కూడా శ్వాసకోశ పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. 6 నిముషాలు సాధారణ ఆరోగ్యవంతులు నడిస్తే సుమారు 400 నుండి 700 మీటర్లు నడక చేయవచ్చన్నారు.

ఆ నడక చేసిన తరువాత పల్స్ ఆక్సిమీటర్ ద్వారా పరీక్ష నిర్వహించుకుంటే గతంలో వచ్చిన రీడింగ్ కన్నా 4 అంకెలు తక్కువ నమోదు అయితే ఆందోళన కరంగా భావించవచ్చన్నారు.

ఊపితిత్తుల సామర్ధ్య పరిస్థితి పల్స్ ఆక్సిమీటర్ ద్వారా 88 నుండి 94 శాతం ఆక్సిజన్ స్థాయి ఉంటే కరోనా పరీక్షలు నిర్వహించుకొని వైద్యుల సలహా తీసుకోవాలన్నారు.

మాస్కుల ధారణలో చాలామంది రకరకాలుగా ధరించడం జరుగుతున్నదని వాటిలో ముక్కుకు కిందకు పెట్టుకోవడం, లేదా గడ్డం కిందకు లాగడం, మొఖం పైకి లాగడం వంటి పనులు చేస్తున్నారని అది కరెక్ట్ కాదన్నారు.

అలాగే మాస్క్ ముందుభాగాన్ని చేతులతో ముట్టుకోవడం కూడా చేయకూడదన్నారు. మాస్క్ ధరించేటప్పుడు, తీసేటప్పుడు మాస్క్ చివరి అంచులను పట్టుకుని తీయడం ఉత్తమం అన్నారు. అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్ ఉన్న మాస్కులు ధరించడం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెపుతున్నారన్నారు.

అదేవిధంగా ఎన్-95 మాస్కులు వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ధరిస్తే సరిపోతుందని అందరూ వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం అంతగా లేదన్నారు.

మాట్లాడేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని, ఎదుటివారితో సంభాషించేటప్పుడు తప్పనిసరిగా కనీసం రెండుమీటర్ల భౌతిక దూరం పాటించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు