అచ్చెన్నను కలవాలంటే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోండి.. చంద్రబాబుకు జీజీహెచ్ సూచన

శనివారం, 13 జూన్ 2020 (16:35 IST)
ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయి అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు.

కరోనా నిబంధనల ప్రకారం అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వలేమని జైళ్లశాఖ అధికారులు తెలిపారు. గత రెండు నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలియజేశారు.

అచ్చెన్నాయుడిని కలిసి పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ని చంద్రబాబు కోరారు. అయితే, ఆయన స్పందిస్తూ... మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలని సూచించారు. 

జేసీ ప్రభాకర్ అరెస్టుకు ఖండన
సిఎం జగన్‌ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని, ప్రజా సమస్యలపై టిడిపి పోరాటాన్ని సహించలేక అక్రమ అరెస్టులకు తెర తీశారని చంద్రబాబు విమర్శించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడంపై చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
హైదరాబాద్‌లోని నివాసంలో ఉన్న ప్రభాకర్‌రెడ్డిని ఎపి పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏడాది పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

నిన్న అచ్చెన్నాయుడు, నేడు జెసి ప్రభాకర్‌రెడ్డి అరెస్టులు జగన్‌ కక్ష సాధింపు చర్యలేనని అన్నారు. తాను జైలుకు వెళ్లానన్న అక్కసుతో జగన్‌ కక్ష పెంచుకుని ఇతరులను జైలుకు పంపుతున్నారని వ్యాఖ్యానించారు.

జగన్‌ కక్ష సాధింపు చర్యలను, దుశ్చర్యలను ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు, అన్నివర్గాల ప్రజలు ఖండించాలని చంద్రబాబు కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు