పవన్‌కు బిగ్‌షాక్.. వైకాపాలో చేరిన మాకినీడి శేషు కుమారి

సెల్వి

బుధవారం, 20 మార్చి 2024 (22:44 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఈసారి లక్ష మెజారిటీ ఖాయమంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నేత ఒకరు పార్టీని వీడారు. వైసీపీలో చేరారు. 
 
గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి జనసేనను వీడి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి ప్రాంతీయ సమన్వయకర్త పి.వి. మిథున్ రెడ్డి, పిఠాపురం వైసీపీ ఇంచార్జి వంగగీత పాల్గొన్నారు. 
 
శేషుకుమారి 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి అప్పట్లో పోటీ చేసిన పెండెం దొరబాబు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు రెండో స్థానం దక్కింది. 
 
జనసేన అభ్యర్థి శేషకుమారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
 అయితే ఈసారి పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి బరిలో నిలిచారు. వైసీపీ నుంచి వంగ‌గీత పోటీ చేస్తున్నారు. కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పవన్ మొగ్గుచూపగా, వైసీపీ కూడా తమ అభ్యర్థిగా కాపు సామాజికవర్గానికి చెందిన మహిళా నేత వంగ గీతను బరిలోకి దింపింది.
 
 
 
ఈ నేపథ్యంలో ఈసారి పిఠాపురం పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో దాదాపు 29 వేల ఓట్లు సాధించిన శేషుకుమారి పార్టీని వీడడం జనసేనకు కాస్త ఇబ్బందికరంగానే ఉందని అంటున్నారు. 
 
మరోవైపు జనసేన పార్టీకి కట్టుబాటు లేదని శేషకుమారి విమర్శించారు.
 
 జనసేనకు నిబంధనలు లేవని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్‌ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆమె విమర్శలు గుప్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు