చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు సుప్రీంతీర్పు

వరుణ్

మంగళవారం, 16 జనవరి 2024 (10:22 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు అక్రమమని, గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడానికి వీల్లేదని, అవినీతి నిరోధక చట్టం 17ఏ కింద గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోకుండానే తనపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం తీర్పు వెలువడనుంది. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మానం... తుది తీర్పును మాత్రం వాయిదా వేస్తూ గత యేడాది అక్టోబరు నెల 17వ తేదీన నిర్ణయించింది. ఈ పిటిషన్‌పై తుది తీర్పును మాత్రం మంగళవారం వెలువరించనుంది. మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధబోస్ ధర్మాసనం వెలువరించనున్నారు. 
 
కాగా, ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వేలు చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు. ఇక సీఐడీ పక్షాన ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరై వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన బెంచ్ తీర్పును వాయిదా వేసింది. 
 
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్టు అక్రమమని చంద్రబాబు వాదిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ తనపై కేసు నమోదు చేసి, అక్రమంగా అరెస్టు చేశారని, కాబట్టి ఈ కేసును కొట్టివేయాంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
 
ఇదిలావుంచితే.. ఈ నెల 17, 19 తేదీల్లో చంద్రబాబుకు సంబంధించిన రెండు కీలక కేసులపై విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు