షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు: విద్యాశాఖా మంత్రి

సోమవారం, 15 జూన్ 2020 (22:23 IST)
పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలని, పరీక్షల సంసిద్ధతకు పిల్లల్లో మానసిక స్థైర్యం, ధైర్యాన్ని నింపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.

విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో పదో తరగతి పరీక్షల నిర్వహణ, సన్నాహాల నిమిత్తం ఆయా జిల్లా అధికారులతో పాటు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ, మండల విద్యాశాఖాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. 
 
జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు...
ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారి కారణంగా కాస్త ఇబ్బంది అయినా ధ్యేయానికి వెనుకంజ వేయకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటూ జూలై 10 నుంచి 15 వరకు పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని పదో తరగతి పరీక్షల నిర్వహణపై స్పష్టతనిచ్చారు.

పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరం వంటి  జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో కరోనా నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ  పరీక్షలకు సిద్ధం అయ్యేలా ధైర్యాన్ని ఇస్తూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి గదికి 10 నుంచి 12 మంది విద్యార్థులు మించకుండా ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రతి కేంద్రానికి విద్యార్థులతో పాటు ఎక్కువ మంది రాకుండా కట్టడి చేసేందుకు పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. ఆరోగ్యం, నియంత్రణలకు సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ నుంచి, జిల్లా పరిపాలన శాఖల సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. రెడ్ జోన్లు, కంటైన్మంట్ జోన్ల  నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటుతో పాటు  ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
11 నుంచి ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు..
ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు జూలై 11 నుంచి 18 వరకు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తామన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని విద్యార్థులు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ఒకసారి తప్పిపోతే మరో అవకాశం ఉందని, ఇవి మన సామర్ధ్యానికి పరీక్షలు అన్నారు.

పిల్లలు భావోద్వేగానికి గురి కాకుండా తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో  మంత్రితో పాటు పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
బడిబయటి పిల్లలను జాబితాలో చేర్చాలి: పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి
 వలసకార్మికుల పిల్లల వివరాలు, బడి బయటి ఉన్న పిల్లల వివరాలను యూడైస్‌లో నమోదు చేయించాలని పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు