వైఎస్ అవినాశ్‌కు కష్టాలు తప్పవా? వచ్చే నెలలో బెయిల్ పిటిషన్‌పై విచారణ

వరుణ్

గురువారం, 18 జనవరి 2024 (16:44 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల్లో ఒకరైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి వచ్చే నెల నుంచి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ హత్య కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... వచ్చే నెలలో విచారణ చేపడుతామని పేర్కొంది. 
 
వివేకా హత్య కేసులోని నిందితుల్లో అవినాశ్ రెడ్డికి గత యేడాది మే 31వ తేదీన తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను జూన్ 9వ తేదీన వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో జూన్ 19 తేదీన అవినాశ్‌‍కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై గత యేడాది జూలై 18, ఆ తర్వాత సెప్టెంబరు 11వ తేదీల్లో విచారణ జరిపింది. పైగా, ఈ కేసును లోతుగా చూడాల్సివుందని ధర్మాసనం పేర్కొంది. అయితే, ఆ తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ జరగలేదు. ప్రతి నెల సుప్రీంకోర్టు కంప్యూటర్ జనరేటెడ్ లిస్టులో కేసు విచారణ తేదీలు కనిపిస్తున్నప్పటికీ ఆ తర్వాత డిలీట్ అయిపోతుంది. 
 
ఈ నేపథ్యంలో జనవరి 16, 17, 18 తేదీత్లో విచాణకు వచ్చే అవకాశం ఉందని కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్‌లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పేర్కొంది. అయినప్పటికీ గురువారం కూడా ఈ కేసు విచారణకు నోచుకోలేదు. దీంతో సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎపుడు విచారిస్తారో తేదీలను వెల్లడించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పిటిషన్‌ను విచారిస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. అయితే, విచారణ తేదీని మాత్రం వెల్లడించలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు