పౌరసత్వ సవరణ చట్టంపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన - వెయిట్ అండ్ సీ...

ఠాగూర్

శుక్రవారం, 15 మార్చి 2024 (09:54 IST)
భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా పరిశీలిస్తున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం ఈ చట్టంపై స్పందిస్తూ, "మార్చి 11వ తేదీన వచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌పై మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా గమనిస్తున్నాం. మత స్వేచ్ఛ, చట్టప్రకారం అన్ని వర్గాల వారిని  సమానంగా చూడటం ప్రజాస్వామ్య మూల సూత్రం" అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 
 
ముఖ్యంగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ వంటి దేశాల నుంచి వలస వచ్చిన ముస్లీమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్రం ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019నుం తీసుకొచ్చింది. దీనికి 2019లోనే పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం లభించింది. కానీ, విపక్షాలు ఆందోళనలు, దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుడంతో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకునిరాకుండా పెండింగ్‌లో ఉంచింది. 
 
తాజాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు దీనిని అమలు, విధి విధానాలను పేర్కొంటూ కేంద్ర హోం శాఖ ఒక నోటిఫికేషన్ జారీచేసింది. దీనివల్ల ముస్లింల పౌరసత్వం పోదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, విపక్ష పార్టీలతో పాటు ముస్లిం సంస్థలు ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే, ఐక్యరాజ్య సమితి కూడా ఈ చట్టం అమలుపై ఆందోళన వ్యక్తం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు