హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు బీ ఫామ్ ఇవ్వని బీజేపీ అధిష్టానం.. అందుకేనా?

వరుణ్

ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (11:31 IST)
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మాధవీలత పేరును ప్రకటించింది. దీంతో ఆమె ప్రచారం చేపట్టి, దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఉన్నట్టుండి బీ ఫామ్ ఇవ్వకుండా నిలిపివేసింది. ఆమెతో పాటు మరో నలుగురు అభ్యర్థులకు కూడా ఈ ఫామ్‌లు ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్ అభ్యర్థిగా మరొకరిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీ ఫామ్‌లు నిలిపివేసిన వారిలో పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి‌లకు కూడా ఫామ్‌లు ఇవ్వలేదు. అయితే, ప్రచారంలో దూసుకుపోతున్న మాధవీలతకు బీ పామ్ నిలిపివేయడం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఆమె తన గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇపుడు ఉన్నట్టుండి బీ ఫామ్ ఇవ్వకపోవడంతో ఆమె డైలామాలో పడ్డారు. 
 
బీజేపీ అధిష్టానం ఈ తరహా నిర్ణయం తీసుకోవడాని కారణం లేకపోలేదు. మాధవీలత భర్త ఒక వైద్యుడు. వారికి హైదరాబాద్ నగరంలో విరించి ఆస్పత్రి ఉంది. కరోనా కష్టకాలంలో కరోనా రోగుల నుంచి భారీగా వైద్య ఖర్చులు చేశారని, వైద్యులు తప్పుడు వైద్యం చేయడం వల్ల అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. పైగా, కరోనా రోగానికి సంబంధించి తప్పుడు వైద్యం చేసినట్టు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కూడా విరించి ఆస్పత్రిలో కరోనా రోగులకు వైద్యం చేయకుండా నిషేధం విధించింది. ఇలాంటి అనేక ఆరోపణలు ఇపుడు తెరపైకి రావడంతో ఆమెకు బీ ఫామ్ నిలిపివేసినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు