మా తమ్ముడికి ఓటు వేస్తేనే నీళ్లిస్తా : కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

వరుణ్

ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (11:04 IST)
తన సోదరుడికి ఓటు వేస్తేనే నీళ్లిస్తామంటూ కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ పోలీసు కేసు నమోదైంది. తన సోదరుడు డీకే సురేశ్‌కు ఓటు వేస్తేనే కావేరీ నది నుంచి నీటిని ఇస్తానని బెంగళూరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినందుకు గాను ఆయనపై ఈ కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల్లో డీకే సురేశ్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సోదరుడి తరపున డీకే శివకుమార్ ఇటీవల ఓ హౌసింగ్ సొసైటీలో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 
 
'నేను ఇక్కడికి ఓ బిజినెస్ డీల్ కోసం వచ్చాను. నా సోదరుడు సురేశ్‌ను మీరు గెలిపిస్తే మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తాను. కావేరీ నదీ జలాలు సరఫరా చేసి మీకు అవసరమైన నీటిని కేటాయిస్తాం' అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీజేపీ వీడియోను కూడా విడుదల చేసింది. డీకే శివకుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని... తన సోదరుడి కోసం ఓట్లను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మండిపడింది.
 
ఈ వ్యాఖ్యలపై చర్చలు తీసుకోవాలని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్నికల సంఘం డీకే ఎన్నికల కోడ్‌కు ఉల్లంఘించినట్లుగా ధ్రువీకరించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకు ఆయనపై పోలీసు కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు