తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం... ఈవీఎంలో తప్పు బటన్ నొక్కితే ఏమవుతుంది...?

వరుణ్

గురువారం, 18 ఏప్రియల్ 2024 (08:49 IST)
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 19వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ మొదటి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే, ఈ నాలుగో దశలో ఏపీతో పాటు ఒరిస్సా, అసెంబ్లీ, అరుణాచల్ ప్రదేశఅ, సిక్కిం అసెంబ్లీలతో పాటు 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగో విడతలో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. 
 
నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి.. 26వ తేదీన పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
 
అయితే, ఓటింగ్ వేసే సమయంలో ఒక్కో సమయంలో కొందరు ఈవీఎంలోని తప్పు బటన్ నొక్కుతారు. అపుడు ఓ ఓటు నమోదైనట్టా? మరోమారు ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారా? అనే సందేహాలు వస్తుంటాయి. ఓటరు ఈవీఎంపై రాజకీయ పార్టీ/అభ్యర్థికి సంబంధించిన గుర్తు వద్ద ఉండే బటన్‌ను నొక్కగానే రెడ్ కలర్ సిగ్నల్ వస్తుంది. ఆ వెంటనే బీప్ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా అదనంగా వీవీ ప్యాట్‌ నుంచి ఒక స్లిప్ రిలీజవుతుంది. మన ఓటు నమోదైంది అనేందుకు ఇవన్నీ ధ్రువీకరణలు! 
 
ఒకవేళ మనం పొరపాటున ఈవీఎంపై తప్పుడు బటన్‌ను నొక్కి ఓటు నమోదు కాకపోతే మరోసారి ఓటు వేయడం అంత ఈజీ కాదు. దాని కోసం అక్కడున్న పోలింగ్ అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. పోలింగ్ అధికారి వెంటనే వచ్చి ఈవీఎంలో ఉండే ఒక బటన్‌ను నొక్కితేనే మరోసారి ఫ్రెష్‌గా ఓటు వేసేందుకు అవకాశం కలుగుతుంది. 'ఎన్నికల ప్రవర్తన నియమాలు- 1961'లోని రూల్ నంబర్ 49ఎంఏ ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో ఓటరు నుంచి రాతపూర్వక ప్రకటనను ప్రిసైడింగ్ అధికారి కోరే అవకాశం ఉంటుంది. ఓటరు చేస్తున్న క్లెయిమ్ నిజమైనదని రుజువయితేనే రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకొని మరోసారి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఈక్రమంలో రిటర్నింగ్ అధికారి అనుమతి వచ్చే వరకు ఆ ఈవీఎంలో పోలింగ్‌ను నిలిపివేస్తారు.
 
వీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం. ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగాన్ని బ్యాలెట్ యూనిట్ (బీయూ) అంటారు. మరో భాగాన్ని కంట్రోల్ యూనిట్ (సీయూ) అంటారు. మనం ఓటును నమోదు చేసే ఈవీఎం యంత్రాన్ని బ్యాలెట్ యూనిట్ (బీయూ)గా పిలుస్తారు. దీన్ని ప్రత్యేకమైన ఓటింగ్ కంపార్ట్‌మెంట్ లోపల ఉంచుతారు. అందులోకి వెళ్లి మనం రహస్యంగా ఓటు వేయొచ్చు. కంట్రోల్ యూనిట్ (సీయూ) అనేది ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి దగ్గర ఉంటుంది. 
 
ఐదు మీటర్ల కేబుల్‌తో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ కనెక్టయి ఉంటాయి. ఎంతమంది ఓటు వేశారు అనే సమాచారం కంట్రోల్ యూనిట్ (సీయూ)లో ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతుంటుంది. వీటికి అదనంగా 'ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్' (వీవీ ప్యాట్) యంత్రం కూడా అక్కడే రెడీగా ఉంటుంది. మనం ఈవీఎంలో ఓటు వేయగానే వీవీ ప్యాట్‌లో నుంచి ఒక స్లిప్ బయటికి వచ్చి అక్కడే కింద అమర్చిన బాక్సులో పడిపోతుంది. ఈవీఎంలు పనిచేయడానికి కరెంటు అవసరం లేదు. అవి బ్యాటరీపై పనిచేస్తాయి. అందువల్ల విద్యుత్ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలను వినియోగించుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు