దేశ వ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు విస్తరణ : ప్రధాని నరేంద్ర మోడీ

వరుణ్

ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (14:38 IST)
దేశ వ్యాప్తంగా బుల్లెట్ రైళ్లను విస్తరించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రస్తుతం అహ్మదాబాద్ - ముంబైలో మధ్య బుల్లెట్ రైల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అలాగే, ఈ తరహా బుల్లెట్ రైళ్ళ సేవలను ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లకూ విస్తరిస్తామన్నారు. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలుకానుందని చెప్పారు. 'సంకల్ప్‌ పత్ర' పేరిట భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. 
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 'అహ్మదాబాద్‌ - ముంబై బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఇవి పూర్తి కావచ్చాయి. అదేవిధంగా తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్‌కు ఒక్కోటి చొప్పున బుల్లెట్‌ రైలు రానుంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి' అని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటివరకు సాధించిన అనుభవాలతో ఈ మూడు ప్రాంతాలకు బుల్లెట్‌ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ కట్టుబడివుందని తెలిపారు. 
 
వందేభారత్‌ రైలు సర్వీసులను దేశంలోని ప్రతి మూలకూ విస్తరిస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. వందేభారత్‌ స్లీపర్‌, వందే భారత్‌ ఛైర్‌కార్‌, వందేభారత్‌ మెట్రో వంటి మూడు మోడళ్లలో దేశంలో ఇవి నడవనున్నాయని అన్నారు. వందేభారత్‌ సేవలు తొలిసారి ఫిబ్రవరి 2019లో ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 51 రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 
 
ఇక ముంబై - అహ్మదాబాద్‌ మధ్య రూ.1.08 లక్షల కోట్లతో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును చేపట్టారు. నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ దీనిని నిర్మిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌కు రూ.10 వేల కోట్లను అందిస్తోంది. గుజరాత్‌, మహారాష్ట్రలు రూ.5 వేల కోట్లు చొప్పున చెల్లించనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు