కొన్ని గంటల్లో మూహూర్తం.. ఇంటి పైకప్పు కూలి వధువు గాయాలు.. అయినా పెళ్లి...

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (13:31 IST)
మరికొన్ని గంటల్లో ఆ వధువు మెడలో మూడు ముళ్లుపడాల్సివుంది. ఇంతలో వధువు ఇంట విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో వధువు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం వరుడుకు తెలిసింది. అయినప్పటికీ.. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలని పెద్దలను కోరాడు. వారంతా సమ్మతించడంతో ముందుగా నిర్ణయించిన సమయానికి పెళ్లి జరిగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి కూతురి ఇంటి పైకప్పు కూలడంతో వధువు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో వధువు ఆర్తిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.
 
అయినప్పటికీ, పెద్ద మనసున్న పెళ్లి కొడుకు ఆర్తిని అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఆర్తి గాయాలతో మంచంపై ఉన్నప్పటికీ పెద్దలు పెళ్లి చేశారు. ఆసుపత్రి వైద్యులు కూడా వారి పెళ్లికి అభ్యంతరాలు చెప్పలేదు. పెళ్లికొడుకు అవధేశ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు. 
 
ఇటువంటి కష్ట సమయంలో పెళ్లి కూతురికి తాను మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అవధేశ్ అన్నాడు. ఈ పరిస్థితి వచ్చినందుకు తాను భయపడ్డానని పెళ్లి కూతురు ఆర్తి చెప్పింది. అయితే, వరుడు తనకు అండగా నిలిచాడని, తాను గాయాలపాలైనా పెళ్లి చేసుకున్నాడని ఆర్తి తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు