భార్యపై అనుమానం, 17 యేళ్ళు కప్‌బోర్డులో దాక్కుని చూసిన భర్త, ఆ తరువాత?

శుక్రవారం, 17 జులై 2020 (19:45 IST)
భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు అనుమానాలు ఉన్న విషయం మనం చాలానే చూశాం. ఒకరి మీద ఒకరికి అనుమానాలు రావడం, విడాకులు తీసుకోవడం, హత్యలు జరగడం ప్రతిరోజు మనం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే భార్య మీద అనుమానంతో ఓ భర్త ఏం చేశాడో తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు.
 
ఒకటికాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్లు ఇంట్లోని కబోర్డులో దాక్కొని భార్య బండారం బయటపెట్టాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. ఉద్యోగానికి వెళుతున్నానని ఉదయం బయటకు వెళ్లడం, కొద్దిసేపటికి దొంగ తాళంతో దొంగచాటుగా ఇంట్లోకి చొరబడి ఇంట్లోని కబోర్డ్‌లో దాక్కొని భార్య ఎవరితోనైనా లింకు పెట్టుకుందేమో, అది బయటపెట్టాలని ఎన్నో ఏళ్లు ప్రయత్నించిన భర్త శాడిజం బయటకు రావడంతో పోలీసులు, మత పెద్దలు షాక్‌కు గురయ్యారు.
 
బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలో రాణి అనే మహిళ రాజు( 45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. 2001లో రాజు, రాణికి పరిచయం అయ్యింది. ఒక సంవత్సరం పాటు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని స్నేహంగా ఉన్నారు. తరువాత రాజు, రాణి ప్రేమించుకుని 2002లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలోని ఒకే ఇంట్లో రాజు, రాణి ఇప్పటి వరకు కాపురం ఉంటున్నారు.
 
పెళ్లి జరిగిన సంవత్సరం పాటు రాజు, భార్య రాణితో చాలా సంతోషంగా ఉన్నాడు. తరువాత భార్య రాణి మీద రాజుకు అనుమానం పెరిగిపోయింది. తనతో కాకుండా తన భార్య రాణి పరాయి మగాళ్లతో లింక్ పెట్టుకుందని రాజుకు అనుమానం పెరిగిపోయింది. ప్రముఖ సెక్యూరిటీ సంస్థలో రాజు ఉద్యోగం చేసేవాడు.
 
దీనితో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రాణితో రాజు సక్రమంగా కాపురం చేసేవాడు కాదు. ఇష్టం ఉండిలేనట్లు కాపురం చేశారు. రాజు, రాణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాణి ఉద్యోగం చేస్తూ కాపురం నెట్టుకోస్తోంది. అయితే భర్త రాజుకు ఒకటే పని, రోజూ బయటకెళ్తున్నానని దొంగతాళంతో దొంగచాటుగా వచ్చి కబోర్డ్‌లో దాక్కోవడం, ఎలాగైనా భార్య పరాయి మగాళ్లతో జల్సా చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్రయత్నాలు చెయ్యడం. రాజు ప్రతిరోజు ఇదే పనిగా పెట్టుకున్నాడు.
 
ఎలాగైనా తన భార్య అక్రమ సంబంధం బయటపెట్టాలని రాజు నిర్ణయించాడు. గత 17 ఏళ్ల నుంచి రాజు అతని భార్యకు షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగానికి వెలుతున్నానని భార్య రాణికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెలుతున్న రాజు తరువాత మరో తాళం ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 
 
గత 17 ఏళ్ల నుంచి ఉద్యోగానికి నామం పెట్టి భార్య రంకు రామాయణం బయటపెట్టాలని భర్త రాజు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం ఒకసారి భార్య ఏదో పనికిరాని వస్తువులు కబోర్డ్‌లో వెయ్యడానికి దాని డోర్ తీసింది. అంతే... అందులో భర్త రాజు దాక్కొని ఉన్న విషయం గుర్తించి షాక్‌కు గురైయ్యింది. ఎంతకాలంగా ఈ గూఢచర్యం చేస్తున్నావ్? అంటూ భర్తను రాణి నిలదీసింది. అంతే... అప్పటి నుంచి రాజు అతని భార్య రాణిని పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు.
 
తన భార్య చాలా అందంగా ఉందని, ఎవరైనా ఆమె వలలో పడిపోతారని రాజుకు ఎక్కువ అనుమానం ఉంది. ఇలా భార్య రాణి మీద రోజురోజుకు అనుమానం పెరిగిపోవడంతో రాజు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరికి పాలు వేసే వ్యక్తి, పేపర్ బాయ్‌లతో గొడవ పెట్టుకుంటున్న రాజు రచ్చరచ్చ చేసి భార్య రాణి పరువు బజారుకు ఈడ్చడానికి అనేకసార్లు ప్రయత్నించాడు.
 
భర్త రాజు ప్రవర్తనపై విసిగిపోయిన భార్య రాణి బెంగళూరులోని పోలీసులను ఆశ్రయించింది. పోలీసు శాఖకు చెందిన వనిత సహాయవాణి కేంద్రంలోని బింద్యా యోహన్నా అనే మహిళా అధికారి రాజు, రాణికి కౌన్సిలింగ్ చేశారు. రాజుకు మానసిక పరిస్థితి బాగాలేదని ఆయనకు రెండేళ్ల పాటు చికిత్స అందించారు. అయితే చికిత్సను మధ్యలో నిలిపివేసి ఇంటికి వెళ్లిపోయాడు. తనకు మెంటల్ లేదనీ, తన భార్య నడవడిక సక్రమంగా లేదని, అనేక మందితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని రాజు ఆరోపణలు చెయ్యడం మొదలుపెట్టాడని సహాయవాణి కేంద్రంలోని బింద్యా యోహన్నా చెపుతున్నారు. అయితే ఇంట్లో పిల్లలతో రాజు మామూలుగానే ఉన్నాడని, మతిస్థిమితం బాగానే ఉందని చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు.
 
తన భర్త రాజు ప్రవర్తనతో విసిగిపోయానని, మీరే న్యాయం చెయ్యాలని, ఇక అతనితో కలిసి తాను జీవించలేనని రాణి చర్చి కమిటీ సభ్యులను ఆశ్రయించింది. అయితే తన భార్యకు పిచ్చిపట్టిందని, ఆమె ఫోన్ కాల్స్ మీరు స్వీకరించరాదని, ఆమె ఫిర్యాదులు మీరు పట్టించుకోరాదని భార్య రాజు చర్చి కమిటీ సభ్యులను నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మొత్తం మీద రాజు తన భార్య రాణి మీద ఎక్కువ అనుమానం పెంచుకున్నాడని, అతని అనుమానం పూర్తిస్థాయిలో పెరిగిపోయిందని, ఇక ఎవ్వరూ ఏమి చెయ్యలేరని ఓ పోలీసు అధికారి అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు