బోరుబావిలో రెండేళ్ల బాలుడు.. పసిపిల్లాడి రోదనలు.. కాళ్ల కదలికలు రికార్డ్

సెల్వి

గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:46 IST)
Boy
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడిని రక్షించే ఆపరేషన్ గురువారం చివరి దశకు చేరుకుందని అధికారులు తెలిపారు. 15 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ తర్వాత కెమెరాలో పసిపిల్లాడి రోదనలు విన్న అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బృందం బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వింది.
 
పసిబిడ్డను చేరుకోవడానికి అడ్డంగా రంధ్రం చేయాల్సిన అవసరం ఉందని, శిశువు ఇరుక్కున్న స్థాయికి చేరుకున్నామని సిబ్బంది ధృవీకరించారు. పసిపిల్లల కాళ్ల కదలికలను కూడా కెమెరా రికార్డు చేసింది.
 
చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను సిద్ధంగా వుంచారు. బోర్‌వెల్‌కు సమాంతరంగా రంధ్రం తవ్వుతుండగా బండరాయి పైకి రావడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని అధికారులు తెలిపారు. పసిబిడ్డను రక్షించడం ఖాయమని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన బుధవారం సాయంత్రం నుంచి ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. 
 
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రెండేళ్ల బాలుడు బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటుండగా కొత్తగా తవ్విన బోరు బావిలో పడిపోయాడు. ఆ చిన్నారిని విజయపురలోని ఇండి తాలూకాలోని లచ్చన గ్రామానికి చెందిన శంకరప్ప ముజగొండ, పూజా ముజగొండ దంపతుల కుమారుడు సాత్విక్ ముజగొండగా గుర్తించారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరకు, నిమ్మ పంటలకు నీరందించేందుకు తన తల్లిదండ్రుల వ్యవసాయ భూమిలో మంగళవారం బోర్‌వెల్‌ వేసినా అది మూసుకుపోలేదు. 400 అడుగుల లోతు వరకు బోర్‌వెల్‌ వేయగా, బాలుడు 15 నుంచి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జనం పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు