పోలీసుల కాళ్లపై పడి ప్రాణాలు విడిచిన వృద్ధురాలు.. ఎక్కడ?

బుధవారం, 6 మే 2020 (09:41 IST)
కొంతమంది పోలీసుల వైఖరి వల్ల ఆ శాఖ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది. ఖాకీ చొక్కా ధరించగానే... పలువురు ఖాకీలు కండకావరాన్ని ప్రదర్శిస్తున్నారు. పిల్లలు పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలు సందర్భాల్లో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు కూడా చూపించడం లేదు. ఫలితంగా పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా లాక్‌డౌన్ రూల్స్ ఉల్లఘించాడన్న ఆరోపణలపై తన కుమారుడిని విడిపించమని ప్రాధేయపడుతూ పోలీసుల కాళ్ళపై పడిన ఓ తల్లి ఠాణాలోనే ప్రాణాలు విడిచింది. ఇది కాస్త వైరల్ కావడంతో మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, ఈ కేసును సుమోటాగా స్వీకరించి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ సంబంధిత జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన సేలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సేలం జిల్లా సేలం నగరంలోని అమ్మాన్‌పేటలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో వేలుమణి అనే ఓ చిరు వ్యాపారి తోపుడు బండిపై నిమ్మకాయల వ్యాపారం చేశాడు. అంటే.. వీధి వీధిలో తిరుగుతా నిమ్మకాయలు విక్రయించాడు. దీంతో వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన ఆ వ్యాపారి తల్లి బాలమణి (70) పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
 
తన కొడుకును విడిచిపెట్టాలంటూ పోలీసుల కాళ్లపై పడి క్షమాపణలు కోరింది. ఆ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఎస్.ఐతో సహా పోలీసులందరి కాళ్లు మొక్కింది. తన కొడుకును విడిచిపెట్టమని బోరున విలపిస్తూ ప్రాధేయపడింది. కానీ, పోలీసుల మనస్సు కరగలేదు. ఆ యువకుడిని విడిచిపెట్టలేదు. దీంతో ఆ తల్లి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలంటూ సేలం నగర పోలీసు కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు