రీల్స్ మోజులో పట్టపగలే అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు అమ్మాయిలు... వీడియో వైరల్

వరుణ్

మంగళవారం, 26 మార్చి 2024 (08:54 IST)
రీల్స్ మోజులో పడి కొందరు యువత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు పట్టపగలే ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు అమ్మాయిలు హోలీ రంగులు పూసుకుంటా అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇవి సద్దుమణగకముందే మరో ఇద్దరు అమ్మాయిలు పట్టపగలు రీల్స్ మోజులో అసభ్యకరంగా ప్రవర్తించారు. ద్విచక్రవాహనంపై వెళుతూ అసభ్యకర హావభావాల్లో మునిగిపోయారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే ప్రతి ఒక్కరికీ పట్టరాని కోపం వస్తుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు స్కూటర్ నడుపుతుండగా వెనుక ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వాహనం ముందుకు వెళుతుండగా ఒకరినొకరు హోలీ రంగులు పూసుకుంటూ అసభ్యకరరీతిలో హావభావాల్లో మునిగిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోలో ఓ హిందీ సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. 
 
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన నోయిడా పోలీసులు ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా అమ్మాయిలతో పాటు వాహనదారుడిని గుర్తించి రూ.33 వేల అపరాధం విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను ఈ చలానా జారీ చేసినట్లు నోయిడా పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పోలీసులు చర్యలపై పలువురు నెటిజన్లు కృతజ్ఞతలు చెబుతుండగా.. మరికొందరు మరీ ఎక్కువ ఫైన్ వేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న యువతులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు