ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వెనక్కి తగ్గిన కవిత... పిటిషన్ వెనక్కి!

ఠాగూర్

మంగళవారం, 19 మార్చి 2024 (15:32 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత ఇదే కేసులో గత యేడాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం వెనక్కి తీసుకున్నారు. పైగా, ఈ కేసులో బెయిల్‌తో పాటు తదుపరి చర్యలను న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. కాగా, ఈ కేసు విషయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు గత యేడాది సమన్లు జారీ చేయగా, వీటిని కవిత సవాల్ చేస్తూ గత యేడాది మార్చి 14వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయరాదని, ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించాలంటూ ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. పైగా, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ ఆమె సుప్రీంను కోరగా కోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచి ఈడీ, కవిత పిటిషన్లపై విచారణలు, వాయిదాల పరంపర కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. అదేసమయంలో ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసులో కవితను ఇప్పటికే అరెస్టు చేయడంతో ఈ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని భావించిన ఆమె తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పిటిషన్ ఉప సంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ బెంచ్‌ అనుమంతిచారని చెప్పారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు