నెహ్రూ జూలాజికల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

సోమవారం, 6 జులై 2020 (09:08 IST)
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ ప్రాణాలు కోల్పోయింది. గత పది రోజుల వ్యవధిలో పులి చనిపోవడం ఇది రెండోసారి. తాజాగా చనిపోయిన రాయల్ బెంగాల్ టైగర్ గుండె సమస్య కారణంగా చనిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ టైగర్ వయసు 11 యేళ్లు. దీనికి కదంబ అనే నామకరణం కూడా చేశారు. 
 
ఈ కదంబ ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనబర్చలేదని, అయితే తరచుగా ఆహారం తీసుకునేది కాదని జూ వర్గాలు వెల్లడించాయి. దాంతో జూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, అయినప్పటికీ మృతి చెందిందని అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహిస్తే దిగ్భ్రాంతికర విషయం తెలిసిందని, కదంబ హార్ట్ ఫెయిల్యూర్‌తో చనిపోయినట్టు వైద్య నిపుణులు తెలిపారని జూ అధికారులు పేర్కొన్నారు.
 
కదంబను 2014లో కర్ణాటకలోని పిలుకుల బయోలాజికల్ పార్క్ నుంచి హైదరాబాద్ జూకి తీసుకువచ్చారు. కాగా, హైదరాబాద్ జూలో గత 10 రోజుల వ్యవధిలో పెద్ద పులులు మృత్యువాత పడడం ఇది రెండోసారి. కొన్నిరోజుల కిందట కిరణ్ అనే పులి మరణించింది. దాని వయసు 8 సంవత్సరాలు. కిరణ్ నియోప్లాస్టిక్ కణితి కారణంగా జూన్ 25న కన్నుమూసిందని జూ వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు