సుశాంత్ మృతిపై స్పష్టత : ఎలా చనిపోయాడో తేల్చిన ఎయిమ్స్!

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (12:44 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఉన్న అనేక సందేహాలకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) స్పష్టత నిచ్చింది. నిజానికి సుశాంత్ ఉరి వేసుకుని చనిపోయాడని కొందరు, కాదు చంపేశారనీ మరికొందరు ఇలా అనేక రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ కీలక విషయాన్ని వెల్లడించింది. సుశాంత్ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని తేల్చింది. 
 
సుశాంత్ మృతికి గల కారణాలను సుదీర్ఘంగా పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు మంగళవారం తమ తుది నివేదికను సర్కారుకు సమర్పించారు. ఆయన మృతదేహంలో ఎలాంటి విషం ఆనవాళ్లు లేవని అందులో స్పష్టంచేశారు. సుశాంత్‌ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని తెలిపారు.
 
ఆయన డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించామని, ఆ తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. సుశాంత్‌ మృతికి సంబంధించి గతంలో మహారాష్ట్ర వైద్యులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ఆ నివేదికలో తేలిన అంశాలే తమ పరిశీలనలోనూ నిర్ధారణ అయ్యాయని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు.ఆయన మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని వైద్యులు భావిస్తున్నారు. 
 
కాగా, సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో మృతి చెందాడు. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్‌ వ్యవహారం కూడా బయట పడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు