అరెస్ట్ వారెంట్ జారీ కాలేదు.. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు.. శంకర్

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (08:21 IST)
తనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు మీడియాలో వచ్చిన కథనాలపై స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ ఖండించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. 
 
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'రోబో' కథ విషయంలో శంకర్‌కు చెన్నై ఎగ్మోర్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై దర్శకుడు శంకర్ స్పందించారు. 
 
తనపై వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. తన న్యాయవాది సాయి కుమరన్ ఇదే విషయమై చెన్నైలోని ఎగ్మూర్ మెట్రోపాలిట్ మేజిస్ట్రేట్ కోర్టును సంప్రదిస్తే, ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని చెప్పారని శంకర్ వివరించారు. 
 
కోర్టు ఆన్‌లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ అంటూ ప్రచారం జరిగి ఉండొచ్చని, ఇప్పుడా పొరబాటును దిద్దుతున్నారని శంకర్ తెలిపారు. కానీ, ఎలాంటి నిర్ధారణ లేకుండానే తప్పుడు వార్తలు ప్రసారం కావడం తనను విస్మయానికి గురిచేసిందని తెలిపారు. 
 
ఈ పరిస్థితి కారణంగా తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అనవసరంగా వేదనకు గురయ్యారని వెల్లడించారు. దయచేసి తన తాజా ప్రకటనను మీడియా సంస్థలన్నీ మరింత ముందుకు తీసుకెళ్లి, తప్పుడు వార్తలు మరింత వ్యాప్తి చెందకుండా వుండాలని శంకర్ విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు