చుండూరు ఊచకోత నిందితులకు శిక్ష రద్దు చేసిన హైకోర్టు!!

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (13:59 IST)
File
FILE
గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో 1991 సంవత్సరంలో జరిగిన దళితుల ఊచకోత కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.

అంతేగాకుండా ఇదే కేసులో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను కూడా న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో చుండూరులో సంబరాలు చేసుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించాలని గుంటూరు జిల్లా ఎస్పీని కోర్టు ఆదేశించింది.

చుండూరులో మూడు నెలల పాటు శాంతిభద్రతలను పరిరక్షించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా, హైకోర్టు తీర్పుపై దళిత నేత కత్తి పద్మారావు స్పందించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసి, దోషులకు శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి