పీఆర్పీ తీర్థం పుచ్చుకున్న శివశంకర్

ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత చిరంజీవి సమక్షంలో ఆయన శనివారం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన శివశంకర్.. ఇటీవల అధిష్టానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే.

పార్టీలో టిక్కెట్లను విక్రయించుకునే విషసంస్కృతి ప్రబలిపోయిందని ఆయన ఆరోపణలు చేశారు. ఇదేతరహా ఆరోపణలు చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) ప్రధాన కార్యదర్శి మార్గరెట్ ఆల్వాపై పార్టీ హైకమాండ్ చర్య తీసుకున్న విషయం తెల్సిందే.

మార్గరెట్ ఆల్వాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన శివశంకర్.. సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ శనివారం పీఆర్పీలో చేరారు. ఇదిలావుండగా శివశంకర్ కాంగ్రెస్ పార్టీకి ఎపుడో రాజీనామా చేయగా, పార్టీ అధిష్టానం మాత్రం ఆమోదముద్ర వేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన పీఆర్పీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిరామ జోగయ్య ఇప్పటికే పార్టీలో చేరిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి