వైఎస్ఆర్ - రోశయ్య చేసిన అప్పులు నేను చెల్లిస్తున్నా : సీఎం కిరణ్

మంగళవారం, 9 అక్టోబరు 2012 (14:35 IST)
File
FILE
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేసిన దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య చేసిన అప్పులు ఇపుడు తాను చెల్లిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకాన్ని అమలు చేస్తున్నప్పిటకీ నాటి ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, కె.రోశయ్యలు ఒక్కపైసా కూడా చెల్లించలేదన్నారు. ఆ అప్పులు ఇప్పుడు తాను చెల్లిస్తున్నానని కిరణ్ చెప్పుకొచ్చారు.

ఇకపోతే... తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, ఆయిల్ రిఫైనరీలతో మత్సకారులకు నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాలర్లు ఉపయోగించే పడవలకు డీజిల్ ధరలో సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కిరణ్ చెప్పారు.

మత్సకారులకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా రూ.20 వేలు చెల్లించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు సౌకర్యాలు కల్పించామని, వచ్చే రెండేళ్లలో అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జాలర్ల వల్ల రాష్ట్రానికి రూ.11 కోట్ల ఆదాయం వస్తుందని, వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి