అవును.. తెలంగాణాకు వాళ్ళిద్దరే శకున్లు: దేవేందర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు, అధికార కాంగ్రెస్ పార్టీయే శకునిలా వ్యవహరిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టి.దేవేందర్ గౌడ్ ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తెరాస, కాంగ్రెస్‌లు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయన్నారు. అంతటితో ఆగని ఈ రెండు పార్టీలు తెలంగాణలో బీసీలకు అండగా ఉన్న తమ పార్టీని భూస్థాపితం చేసే కుట్రలను పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి వారిని తెలంగాణ ప్రజలు సాంఘిక బహిష్కరణ చేస్తే తప్ప బడుగు వర్గాలకు న్యాయం జరగదన్నారు.

తెలంగాణలో అమలులో ఉన్న పటేల్‌-పట్వారీ వ్యవస్థను తెదేపా రద్దు చేయకపోతే సామాజిక పరిస్థితులు ఇంకెంత దయనీయంగా ఉండేవో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ రణభేరి సభను అడ్డుకున్న వారు తెలంగాణ ద్రోహులేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజల పక్షం వహించాలే తప్ప పార్టీల పక్షం వహించకూడదని ఆయన హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము పోరాడుతుంటే, తమ సభలను అడ్డుకోవడం ఎంత వరకు న్యాయమన్నారు.

వెబ్దునియా పై చదవండి