ఆ వ్యాఖ్యలు కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనం: జీవన్

గురువారం, 8 అక్టోబరు 2009 (15:09 IST)
రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుపెట్టుకుని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ జలయజ్ఞంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. వీటిపై జీవన్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టుపై కేసీఆర్ విమర్శలు చేయడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.

ముఖ్యంగా, తెలంగాణా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిపై కేసీఆర్ విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. అలాగే, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించడం పచ్చి అవకాశవాదమేనన్నారు. ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీ చెంతకు వచ్చేందుకు పావులు కదుపుతున్నారని, ఇలాంటి పచ్చి మోసకారి దేశంలో మరొకరు ఉండబోరని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి