కాంగ్రెస్ దొంగలు... 15 వేల కోట్లు దోచుకున్నారు : చంద్రబాబు

గురువారం, 8 మార్చి 2012 (11:31 IST)
File
FILE
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దొంగలు ఏకంగా 15 వేల కోట్ల రూపాయలను మద్యం సిండికేట్ల రూపంలో దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సిగ్గు శరం లేకుండా 31 బెల్టు షాపులు ఉన్నట్టు ప్రకటించుకున్నారని బాబు ఎద్దేవా చేశారు.

నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన గురువారం రెండో విడత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ నేతలపైనా దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ నేతలను దొంగలుగా పోల్చారు.

మద్యం సిండికేట్ల పేరుతో ప్రజల సొమ్ము 15 వేల కోట్ల రూపాయలను తమ జేబుల్లోకి నొక్కేసుకున్నారు. అలాగే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానురాంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని చంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి