కావూరి వ్యాఖ్యలు భేష్.. కాంగ్రెస్ తేల్చదు : కేటీఆర్

శనివారం, 29 జూన్ 2013 (15:08 IST)
File
FILE
తెలంగాణ అంశంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్వాగతించారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ ఇప్పట్లో తేల్చదని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

ఆయన శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్రా ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అందువల్ల జఠిలమైన తెలంగాణ సమస్య పరిష్కారానికి ఇదే సరైన సమయమన్నారు. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

కావూరి సాంబశివరావుతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన కేంద్రమంత్రి హాదాలో చేసిన వ్యాఖ్యలను తాము, తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానంలో కావూరి కూడా భాగస్వామిగా ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.

పైపెచ్చు రాష్ట్ర విభజన అంశంలో కావూరి చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను పెంచేలా ఉన్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంతకుముందు మంత్రి కావూరిని కేటీఆర్ కలిశారు. సిరిసిల్లలో చేనేత క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలంటూ ఆయన ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చేతన కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.

వెబ్దునియా పై చదవండి