గ్రేటర్‌లోనూ సామాజిక న్యాయం పాటించాం: చిరంజీవి

బుధవారం, 11 నవంబరు 2009 (14:30 IST)
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తున్న 64 మంది అభ్యర్థుల్లో 40 మంది సామాజిక వర్గాలకు చెందిన వారేనని ఆయన వివరించారు.

తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తామనే అంశాన్ని ఓటర్లకు వివరించాలని సూచించామన్నారు. ముఖ్యంగా, దీర్ఘకాలిక ప్రయోజనాలను వదలుకుని ఒక్కరోజున లభించే లాభం కోసం దిగజారవద్దని ఆయన గ్రేటర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మద్యం, డబ్బు పంపిణీ వంటివి జరిగితే వెంటనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాలని ఆయన కోరారు.

ఇకపోతే.. హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని భావించడం వల్లే తాము కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడ్డామన్నారు. ఇవి బెడిసి కొట్టడం వల్ల తమకెలాంటి నష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజారాజ్యానికి ఓటు వేయవద్దంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుపై చిరంజీవి ఘాటుగానే స్పందించారు. తమకు ఓటు వేయవద్దని చెప్పడానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. వచ్చే 13వ తేదీన తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి