తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సినీ నటుడు తారకరత్న పక్కలో బల్లెంలా మారాడు. మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలన్న చంద్రబాబు ఆశలపై ఈ నందమూరి హీరో నీళ్లు చల్లుతున్నాడు. దీనివల్ల నందమూరి కుటుంబంలోనే చీలికలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రజలు ఆశీర్వదిస్తే.. బాబాయ్ (బాలకృష్ణ) ముఖ్యమంత్రి అవుతారని తారకరత్న పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలు అటు తెదేపా శ్రేణులను, ఇటు నందమూరి కుటుంబాన్ని కలవరపెట్టాయి. పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేందుకు బాబు రంగంలోకి దిగారు. బాలకృష్ణ చేత స్వయంగా ప్రకటన చేయించారు. తెదేపా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని ప్రకటించారు. అయితే తారకరత్న చేసిన వ్యాఖ్యలపై మాత్రం వివాదం సద్దుమణగలేదు.
అందువల్ల తారకరత్నను ఎక్కడకూ ఆహ్వానించ వద్దని జిల్లా నేతలకు బాబు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. తారకరత్న వ్యాఖ్యలు పార్టీకి చేటు తెస్తున్న వైనంపై బాలకృష్ణ దృష్టికి తీసుకు వచ్చిన బాబు, ఆయనను అదుపులో ఉంచాలని సూచించినట్లు వినికిడి. మొత్తం మీద చద్రబాబు ఆశలపై తారకరత్న నీళ్లు గుమ్మరించేలా ఉన్నాయి.