చంద్రబాబు : ఎన్నికల్లో డబ్బు రాజ్యమేలుతోంది.. ప్రింటర్లు అవసరం!

FILE
ఎన్నికల్లో ధనం, కండబలం పెచ్చుమీరిపోయాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల్లో డబ్బు రాజ్యమేలుతోందని, ధనాధిపత్యానికి కళ్లెం వేసేందుకు మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరినట్లు చంద్రబాబు చెప్పారు.

ఢిల్లీలో ఈసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని, ఓటు ఎవరికి వేశామో ఓటర్లు తెలుసుకునే అవకాశం ఉండాలని కోరామని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈవీఎం యంత్రాలకు ప్రింటర్లు అమర్చి రశీదులు ఇచ్చే విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని అడిగినట్లు బాబు వివరించారు. దేశంలో నల్లడబ్బు రాజ్యమేలుతోందన్నారు.

కాగా., ఓటువేసిన వెంటనే రశీదు, ఈవీఎంలు, ఎన్నికల విధానంలో మార్పులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశం అయింది. పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని, దానికనుగుణంగా మార్పులు చేసేందుకు ఈసీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది.

దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఇతర రాజకీయ పార్టీల నుంచీ కూడా ముఖ్య నేతలు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి