జగన్ అవినీతిపై సుష్మా ఎందుకు స్పందించలేదు: హరీష్ రావు

ఆదివారం, 10 జూన్ 2012 (16:57 IST)
FILE
దేశంలో జగన్ అవినీతిపై చర్చ జరుగుతుంటే లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఎందుకు స్పందించలేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకే పరకాలలో బీజేపీ పోటీ చేస్తుందని హరీష్ రావు విమర్శించారు. ప్రపంచంలోనే జగన్ అతిపెద్ద అవినీతి పరుడని హరీష్ రావు ధ్వజమెత్తారు.

మరోవైపు తెరాస నేతలు బిజెపిని ఎలాగైనా ఉప ఎన్నికలలో దెబ్బతీసేందుకు వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం తెరాస సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు బిజెపి పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

బీజేపీ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. తెరాస స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగితనే తెలంగాణ వస్తుందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డమ్మీ అని, ఆయన వెనుక వెంకయ్య నాయుడు, గాలి జనార్ధన్ రెడ్డి ఉన్నారని ధ్వజమెత్తారు. సుష్మా స్వరాజ్ జగన్ అవినీతిపైన నోరెత్తక పోవడమే ఇందుకు మంచి కారణమన్నారు.

వెబ్దునియా పై చదవండి