జడ్చర్ల హత్య .. నా భర్తను శేఖరే హత్య చేయించాడు : అర్షిత

గురువారం, 18 జులై 2013 (16:02 IST)
File
FILE
జడ్చర్లలో జరిగిన దారుణ హత్యపై హతుని భార్య ఎర్ర అర్షిత స్పందించారు. తన భర్త ఎర్ర జగన్ మోహన్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎర్ర శేఖరే హత్య చేయించారని ఆమె ఆరోపించారు. బుధవారం రాత్రి జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర జగన్ మోహన్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే.

దీనిపై హతుని భార్య అర్షిత స్పందిస్తూ పెద్దచింతకుంట పంచాయతీకి తాను వేసిన నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే తన భర్తను చంపేస్తానని ఎర్ర శేఖర్ బెదిరించారన్నారు. తన సోదరుడి హత్యకు కారకుడైన ఎర్రశేఖర్‌ను కఠినంగా శిక్షించాలని జగన్‌ మోహన్‌ సోదరి శ్రీదేవి డిమాండ్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తమ్ముడైన జగన్ మోహన్ (41)ను దేవరకద్ర పాత బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు సఫారీ కారులో వచ్చి రివాల్వర్‌తో బుధవారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఈ హత్యపై హతుని భార్య... జగన్ మోహన్ అన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌పై సందేహం వ్యక్తం చేయడంతో ఈ కేసులో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి